గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మణినగర్ నియొజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి శ్వేతాభట్ పై 75000 పై చిలుకు ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. మరోవైపు గుజరాత్ విధానసభలో ప్రతిపక్షనేతగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి శెట్టి సింగ్ గోహిల్ భావ్ నగర్ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి అయిన భాజపా అభ్యర్థి పురుషోత్తమ్ సింగ్ సోలంకి చేతిలో ఓటమి చెందారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి విజయఢంకా మోగించి తన సారధ్యంలోని భారతీయజనతా పార్టీకి తిరుగులేని ఘనవిజయాన్ని సాధించిపెట్టి తన స్టామినాను చాటిచెప్పారు నరేంద్ర మోడీ. ఈ విజయంతో ఎప్పటి నుండో భాజపాలో ప్రధాని అభ్యర్థిగా ముందువరుసలో ఉన్న మోడీ పేరు దాదాపుగా ఖాయమైనట్టే అని చెప్పుకోవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుత భాజపా అగ్రనాయకుల జాబితాను పరికిస్తే ప్రధాని అభ్యర్థులుగా ఎల్. కె. అద్వానీ తరవాత చెప్పుకోదగ్గ పేరు మోడీ ఒక్కటే. అందునా అద్వానీ వయోభారం మూలంగా ఆ పదవి పట్ల అనాసక్తి కనబరుస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. కాబట్టి కనుచూపుమేరలో భాజపాకు ప్రధాని అభ్యర్థిగా మోడీ తప్ప వేరొక ఘనాపాటి లేనట్టే.
|